ఐటిడిఏ కాంప్లెక్స్ దుకాణాల అన్యాక్రాంతం పై విచారణ జరిపించాలి..
అక్రమ వసూళ్లపై చర్యలు తీసుకోవాలి..
ఐ టి డి ఏ ఏపీఓకు సామాజిక సేవకులు కర్నే బాబురావు వినతి..
మణుగూరు పట్టణంలోని అంబేద్కర్ సెంటర్ లోని ఐటిడిఏ షాపింగ్ కాంప్లెక్స్ లో గిరిజనులకు కేటాయించిన వ్యాపార దుకాణాలను అన్యాక్రాంతం మవుతున్నాయని, దుకాణాలను గిరిజనుల నుండి దక్కించుకున్న కొందరు గిరిజనే తరులు వ్యాపారం వ్యాపారాలు సాగించడంతోపాటు, చిరు వ్యాపారులనుండి రోజువారీగా అక్రమ వసూళ్లు జరుగుతున్నాయని, అధికారులు వెంటనే తక్షణ చర్యలు తీసుకోవాలని సామాజిక సేవకులు కర్నే బాబురావు సొమవారం ఐ టి డి ఏ ఏ పీ ఓ డేవిడ్ రాజుకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా బాబురావు విలేకరులతో మాట్లాడుతూ,మణుగూరు పట్టణంలో గిరిజనుల స్వయం ఉపాధి అభివృద్ధి కోసం నిర్మించిన ఐటిడిఏ కాంప్లెక్స్ ప్రస్తుతం అసలు ఉద్దేశానికి విరుద్ధంగా ఉపయోగించబడుతోందని తెలిపారు. కాంప్లెక్స్లోని దుకాణాల్లో ఒకటి రెండు మినహా మిగతావి గిరిజనేతరుల ఆధీనంలో ఉండటం వల్ల నిజమైన గిరిజనులకు అన్యాయం జరుగుతోందని పేర్కొన్నారు. అంతేకాకుండా షాపుల ముందు తోపుడు బండ్లపై వ్యాపారం చేస్తున్న చిన్నచిన్న వ్యాపారుల వద్ద నుండి వారు నెలకు రూ.3,000 నుంచి రూ.4,000 వరకు అక్రమంగా వసూలు చేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయని చెప్పారు. కొందరు గిరిజనులు తమకు కేటాయించిన దుకాణాలను గిరిజనేతరులకు అద్దెకిస్తూ నెలవారీగా కిరాయిలు పొందుతున్నారన్నారు. ఈ సమస్యపై మణుగూరు మున్సిపాలిటీ కమిషనర్కు పలుమార్లు ఫిర్యాదు చేసినప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని తెలిపారు. దీంతో అక్రమ వసూళ్లు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. ఈ విషయాన్ని ఐ టి డి ఏ అధికారులు సమగ్రంగా పరిశీలించి తక్షణ విచారణ జరిపించి, అక్రమ వసూళ్లు చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, అలాగే ఐటిడిఏ కాంప్లెక్స్లోని దుకాణాలను నిజమైన గిరిజనులకు మాత్రమే కేటాయించి వారి హక్కులను పరిరక్షించాలని కర్నే బాబురా వు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. లేనిచో విషయాన్ని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్తానని పేర్కొన్నారు.